పడవ మునిగి 78 మంది మృతి

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా పట్టణం నుంచి గోమా పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్‌ లోడ్‌ కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది. కివూ సరస్సులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. కాంగో ప్రభుత్వ బలగాలకు, ఎం23 తిరుగుబాటుదారులకు మధ్య గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు. దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ప్రమాదం జరిగింది.