సీబీఎన్ మార్క్ ..వెతికి మరీ ప్రభుత్వ సాయం

దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ 14 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయింది.. కుమారుడు మానసిక వైకల్యంతో సరిగా నడవలేడని, మాట్లాడలేని పరిస్థితి. పింఛను కూడా రావడం లేదు. ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఏసమ్మ తన గోడు చెప్పుకొంది. తన కుమారుడికి కనీసం దివ్యాం గ పింఛన్‌ మంజూరు చేయాలని కోరింది. దీంతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.లక్ష ఆమె బిడ్డ పేరున డిపాజిట్‌ చేయాలని   అక్కడికక్కడే కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు.

మహిళ నుంచి దరఖాస్తు లేకున్నా, ఏసమ్మ వివరాలు లేకపోయినా సీఎంను కలిసిన ఆమె ఫొటో ఆధారంగా రెవెన్యూ, పోలీసు అధికారులు వివరాలు సేకరించారు. రూ.లక్ష చెక్‌ను గురువారం కలెక్టర్‌ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి భీమవరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఏసమ్మ, ఆమె కుమారుడికి అందజేశారు. సీఎం చంద్రబాబు చేసిన సహాయం ఎన్నటికీ మరువలేమని ఏసమ్మ పేర్కొన్నారు. పింఛన్‌ మంజూరుకు, ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆమెకు కలెక్టరు భరోసా ఇచ్చారు.