మోదీ బంపరాఫర్.. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి
posted on May 30, 2019 12:22PM

నరేంద్ర మోదీ భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గురువారం రాత్రి 7 గంటలకు కొత్త మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేస్తారు. సుమారు 8,000 మంది అతిథుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధానితో పాటు, కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
అయితే మోదీ కేబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే అంశంపై చర్చ నడుస్తోంది. ఈ సారి తెలంగాణ నుంచి ఒకరికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ నుంచి ఘన విజయం సాధించిన కిషన్రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి దాదాపు 50వేల మెజార్టీతో విజయం సాధించిన కిషన్రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మోదీ, అమిత్ షా నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు కిషన్రెడ్డికి సమాచారం అందిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పనిచేసిన బండారు దత్తాత్రేయ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాలనే నిర్ణయంతో ఈసారి కిషన్రెడ్డికి అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.