బాబు 5 వేలకే ఇస్తే జగన్ 20 వేలు గుంజుతున్నారు

చంద్రబాబు అంటే చాలు ఇంతెత్తున లేచే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నోటి వెంట బాబు పాలనే బెటర్ అనే మాట విపిస్తోంది. చంద్రబాబు పాలన తో పోలిస్తే సీఎం జగన్ పాలన బావుందని ఆ మధ్య ప్రకటించిన ఎమ్మెల్సీ వీర్రాజు గారు తాజాగా స్పందిస్తూ ఏపీలో ఇసుక సరఫరా మొత్తం అవినీతిమయం అయిపోయిందని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ హయం లో ఆ పార్టీ నేతలు ఎంత తిన్నా కూడా బాబు ఇసుకను 5 వేలకే లారీ ఇసుక ఇచ్చారని తెలిపారు. కానీ అదే లారీ ఇసుకకు జగన్ ప్రభుత్వం 20 వేలు వసూలు చేస్తోందని అయన విమర్శించారు. ఇసుక కోసం స్టార్ట్ చేసిన ఆన్ లైన్ విధానం అస్తవ్యస్తంగా తయారైందని.. ఇసుక యాప్ అర గంటలోనే క్లోజ్ అవుతుందని అయన అన్నారు. ఐతే బ్లాక్ లో ఇసుక పై కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందని విమర్శించారు. సీఎం జగన్ ఏడాది పాలన పై స్పందిస్తూ ప్రజలు వైసిపి రంగులు చూసి 151 సీట్లు ఇవ్వలేదన్నారు. వార్డు గ్రామా సచివాలయాలకు రంగులు వేసే జీవో వచ్చినపుడే ఇది పద్దతి కాదని తాను పంచాయతిరాజ్ మంత్రికి ఫోన్ చేసి చెప్ప్పానని ఈ సందర్బంగా అయన తెలిపారు. ఇపుడు ఇదే విషయంలో సుప్రీం కోర్ట్ మొట్టికాయలు తినే వరకు పరిస్థితి వచ్చిందని ఇది రాష్ట్ర ప్రతిష్ట కు దెబ్బని ఆయన అన్నారు.

జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల కోసం సేకరించే భూములలో కూడా అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఎకరం 10 లక్షలు చేసే రాజమండ్రి ఆవ భూమిని 45 లక్షలకు కొన్నారని.. ఐతే ఇదే భూమిని సాగునీటి శాఖ అధికారులు ముంపు ప్రాంతం గా గుర్తించారని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం లో 150 కోట్ల అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు హయం లో రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం అమ్మించడం ద్వారా వచ్చిన పన్ను తో పాటు తాగి బయటకు వచ్చిన వారి వద్ద నుండి మళ్ళీ ఫైన్ వసూలు చేసావారని తెలిపారు. ప్రస్తుతం పేదలకు మద్యం అందుబాటులో ఉండకూడదని కొత్త బ్రాండ్లు తెచ్చి రేట్లు పెంచినా తాగేదంతా పేదలేనని ఆయన అన్నారు. ఈ కొత్త బ్రాండ్లు కూడా వైసిపి నాయకులకు సంబంధించినవేనని అన్నారు. టీడీపీ జన్మభూమి కమిటీలు తెస్తే ఇపుడు జగన్ ప్రభుత్వం 300 కోట్ల ఖర్చుతో వాలంటీర్ల వ్యవస్థ తెచ్చిందని ఐతే ప్రతి గ్రామంలో నాటు సారా ప్రవాహం నడుస్తున్నా.. వాలంటీర్లు ఫిర్యాదు చేయడం లేదని అయన విమర్శించారు.