రాహుల్ గాంధీకి మరో ఎదురు దెబ్బ
posted on Apr 20, 2023 1:53PM
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో ఇప్పటికే రెండేళ్ళు జైలు శిక్ష పడిన నేపధ్యంలో పార్లమెంట్ సభుత్వం కోల్పోయిన రాహుల్ గాంధీకి, అదే కేసులో మరో మారు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ కేసుకు సంబదించి సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు మార్చి23 న ఇచ్చిన తీర్పులో రెండేళ్ళు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో మార్చి 24న ఆయనపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కాగా సూరత్ కోర్టు విధించిన శిక్షను నిలిపేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన స్టే పిటిషన్ను అదే సూరత్ సెషన్స్ కోర్టు గురువారం (ఏప్రిల్ 20) తిరస్కరించింది. ఈ తాజా తీర్పు పర్యవసానంగా రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై విధించిన అనర్హత కొనసాగుతుంది. అలాగే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం తక్షణ పునరుద్దరణకు ఇక తలుపులు మూసుకు పోయినట్లేనని అంటున్నారు. రాహుల్ గాంధీ పై కోర్టుకు వెళ్లి శిక్ష అమలు కాకుండా స్టే తెచ్చుకున్నా, అయన నిర్దోషిగా తేలే వరకూ అనర్హత కొనసాగుతుందని అంటున్నారు.
కాగా ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ జరపలేదని, పరిమితులు దాటి కఠినంగా వ్యవహరించిందని, ఇది రెండేళ్లు జైలుశిక్ష విధించాల్సినంత కేసు కాదంటూ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించారు. శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ పిటిషన్పై వారం రోజుల క్రితం వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్పీ మొగేరా గురువారం (ఏప్రిల్ 20) తీర్పును వెలువరించారు. దీంతో రాహుల్ గాంధీ పై కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి ఎదురైంది.
రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలోని కోలార్లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్కు చెందిన పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీ దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయింది. ఇది కక్షపూరిత చర్య అని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.అయితే,నేరాలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని పునీత్ కోర్టుకు వివరించారు.దీంతో శిక్ష తగ్గించాలన్న రాహుల్ గాంధీ అభ్యర్ధను కోర్టు తిరస్కరించింది.