తెలంగాణలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
posted on Sep 9, 2020 11:09AM
తెలంగాణలో కీసర ఎమ్మార్వో రికార్డ్ స్థాయిలో కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సంగతి మరిచిపోక ముందే తాజాగా ఏసీబీ వలలో మరో పెద్ద తిమింగలం చిక్కింది. ఒక భూ వివాదాన్ని పరిష్కరించేందుకు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏకంగా రెండు కోట్లకు పైగా లంచం డిమాండ్ చేయటంతో పాటు కొటి 12 లక్షలను నగదు రూపంలో అందుకుని, మరో కోటి రూపాయల ప్రాపర్టీని తన కుటుంబీకుల పేరుకు మార్చాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని పసిగట్టిన ఏసీబీ అయన నివాసాల పై దాడి చేసి సోదాలు జరుపుతోంది. దీనికి సంబంధించిన ఒక చెక్కు ను తీసుకోవడంతో పాటు ఒక ప్రాపర్టీని కూడా ఇప్పటికే నగేష్ తన సంబంధికుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ భూవివాదం కేసులో అసిస్టెంట్ కలెక్టర్ నగేష్ ఆడియో క్లిప్స్ తో సహా దొరికిపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం నగేష్, ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.