అచ్చెన్నకు ఏపీ టీడీపీ పగ్గాలు.. తెలంగాణకు మళ్లీ రమణే..

తెలుగుదేశం పార్టీ కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మళ్లీ ఎల్.రమణకే అవకాశం కల్పించారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని నియమించారు. 

 

27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయగా, 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు.  కొత్తగా ప్రకటించిన కమిటీల్లో ఆరుగురిని ఉపాధ్యక్షులుగా నియమించిన చంద్రబాబు.. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా మరో 8మందిని ప్రకటించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావు ను నియమించారు. 

 

పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమ, ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్ కుమార్ గౌడ్ ను నియమించారు. పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు.

 

కాగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించానున్నారని కొద్దిరోజుల నుండి ప్రచారం జరిగింది. ఊహించినట్టుగానే చంద్రబాబు అచ్చెన్నాయుడుని అవకాశం కల్పించారు. ఆయనైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని బలంగా వినిపిస్తారన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో కూడా ఉంది. అయితే, తెలంగాణ టీడీపీ అధ్యక్ష విషయంలో మాత్రం పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశముంది. రమణను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు.. చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినా.. మళ్లీ ఆయనకే అవకాశం కల్పించడం చర్చనీయాంశమైంది.