మెదడును వృద్దాప్యం నుండి కాపాడే వ్యాయామం.. 40 ఏళ్లు దాటిన వాళ్లకు  ఎంతో ముఖ్యం!


ప్రతి మనిషికి మెదడు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం.  కొంతమందికి చిన్న వయసులోనే  మతిమరుపు,  ఆలోచనా శక్తి తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి.  ఇవన్నీ జరగడాన్ని వైద్యుడు మెదడు వృద్దాప్యానికి చేరడం అని చెబుతారు.  ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత చాలామందిలో మెదడు వృద్దాప్యానికి లోనవడం కనిపిస్తూ ఉంటుంది. కానీ మెదడు వృద్దాప్యానికి లోనవకుండా ఉండాలంటే వ్యాయామాలు చాలా చక్కగా సహాయం చేస్తాయి.  పరిశోధనల ప్రకారం ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసిన వారి మెదడు,  దినచర్యలో ఎటువంటి శారీరక మార్పులు చేయని వారి కంటే ఇంకా యంగ్ గా మారిందని తేలింది.  మరీ ముఖ్యంగా వృద్దులు కూడా వ్యాయామం చేయడం వల్ల.. ఏ వ్యాయామం చేయని తక్కువ వయసులో ఉన్నవారి కంటే మెదడు మరింత చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. ఈ వ్యాయామం గురించి తెలుసుకుంటే..

జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యం..

 మెదడును జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా సంవత్సరాల పాటు కొనసాగే దీర్ఘకాలిక ప్రక్రియ.  . మెదడు వయస్సులో చిన్న మార్పులు కూడా దశాబ్దాల తర్వాత గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఏరోబిక్ వ్యాయామం  మెదడును యవ్వనంగా ఉంచడమే కాకుండా,  అనేక ఇతర మానసిక ప్రయోజనాలు  కూడా చేకూరుస్తుంది.

ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే  ఆలోచనలో స్పష్టత మెరుగవుతుంది.  జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది .మొత్తం మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఏరోబిక్ వ్యాయామం అంటే..

ఏరోబిక్ వ్యాయామాన్నే "కార్డియో" అని కూడా పిలుస్తారు.  ఈ  వ్యాయామం మెదడుకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏరోబిక్ వ్యాయామం ప్రయోజనాలు..

ఊపిరితిత్తులు, గుండ,  కండరాలను బలోపేతం చేస్తాయి.  బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయి. స్ట్రోక్,  డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వేగంగా నడవడం, ఈత, సైక్లింగ్ వంటివి కూడా ఈ ఏరోబిక్ వ్యాయామాల కిందకు వస్తాయి.  వీటిని దినచర్యలో భాగం చేసుకుంటే మంచిది.

                                  *రూపశ్రీ.