ఇంట్లో ఈ మొక్కలు పెంచితే పరమశివుడు చాలా సంతోషిస్తాడట..!

 


భారతీయులు చెట్లను పంచభూతాలలో ఒక్కటిగా భావిస్తారు.  అందుకనే చెట్లను కూడా దైవంతో సమానంగా పూజిస్తారు.  త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వడిని లయకారుడు అని అంటారు.  అన్నింటిని ఆయన తనలో లయం చేసుకుంటాడని అర్థం. పరమేశ్వరుడికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా కొన్ని మొక్కలంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతి.  ఆ మొక్కలను ఇంట్లో పెంచితే పరమేశ్వరుడు సంతోషిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ మొక్కలు నాటితే శివుడి అనుగ్రహం కలుగుతుందని,  పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతాడని చెబుతారు.  ఆ మొక్కలు ఏంటంటే..


బిల్వపత్రం లేదా మారేడు..


శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు బిల్వపత్రాన్ని సమర్పిస్తారు.  సాధారణ సమయాల్లో కూడా ఎలాంటి పూజా ద్రవ్యాలు లేకపోయినా బిల్వపత్రం సమర్పిస్తే చాలు శివుడు ప్రసన్నుడు అవుతాడు.  శ్రావణమాసంలో బిల్వపత్రం మొక్కను నాటడం వల్ల శివుడు ప్రీతి చెందుతాడు అంట.


శమీ వృక్షం..


శమీ వృక్షాన్నే జమ్మిచెట్టు అని కూడా పిలుస్తారు.  పాండవులు వనవాసానికి వెళ్ళేముందు తమ  ఆయుధాలను జమ్మిచెట్టు మీద భద్రపరిచారని పురాణం చెబుతోంది. అయితే ఈ జమ్మిచెట్టు ఆకులు కూడా శివుడికి చాలా ప్రీతి. ఈ మొక్కను నాటడం వల్ల శివుడు ప్రసన్నుడు అవుతాడు.

ధాతుర మొక్క..

ఈ మొక్కకు కాయలులాగా ఉంటాయి. వీటికి ముల్లు ఉంటాయి. ఇది విషస్వభావం కలిగిన మొక్క. కానీ ఈ మొక్క పువ్వులను పరమ శివుడికి మాత్రమే సమర్పిస్తారు.  ఈ మొక్క అంటే శివుడికి ప్రీతి అంట.  ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట.  శత్రువుల పై విజయం సాదిస్తారట.


జిల్లేడు..


రహదారుల పక్కన, గుడులలో విరివిగా కనిపించే జిల్లేడు మొక్కలకు పూచే పువ్వులను కేవలం పరమేశ్వరుడికి మాత్రమే సమర్పిస్తారు.  జిల్లేడు మొక్కను ఇంట్లో నాటడం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతారు.


రుద్రాక్ష..


రుద్రాక్ష సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికి ప్రతిరూపంగా భావిస్తారు.  ఈ మొక్క ఇంట్లో ఉంటే మానసిక ప్రశాంతతతో పాటూ పాజిటివ్ ఎనర్జీ కూడా ఆ ఇంట్లో ఉంటుందట.


సంపంగి..

సంపంగి పువ్వులను చాలా రకాల పేర్లు ఉన్నాయి. అయితే శ్రావణ మాసంలో ఇంటికి వాయువ్య దిశలో చంపా మొక్కను నాటితే ఆ ఇంట్లో ధన ధాన్యాల కొరత ఉండదని చెబుతారు.


                                      *రూపశ్రీ.


More Shiva