అప్పుడు మాతో పనులు చేయించుకుని ఇప్పుడు ఇలాగా: వైసిపి పై కన్నా ఫైర్

 

మొన్న జరిగిన ఎపి ఎన్నికలలో వైసిపి కి బీజేపీ ప్రత్యక్షంగానూ, పరోక్షంగా సహకరించిందని బాబుతో సహా టీడీపీ వర్గాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ వైసిపిపై ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో ఎన్నో పనులు చేయించుకున్నారని, ఐతే ఇప్పుడు అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అవినీతిపరులను పట్టుకున్నారని అయన ప్రశ్నించారు. మైనింగ్ అక్రమ రవాణాలో కేవలం వ్యక్తులు మాత్రమే మారారని, మిగిలిన వ్యవహారమంతా గతంలో మాదిరే జరుగుతోందని అయన ఆరోపించారు. బీజేపీ పార్టీ పల్నాడులో తలపెట్టిన ధర్నాను తాము రద్దు చేయలేదని, వాయిదా మాత్రమే వేశామని అయన తెలిపారు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై తమ పార్టీ తరుఫున డీజీపీకి ఫిర్యాదు చేస్తామని కన్నా చెప్పారు.