ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో బ్రేక్‌ఫాస్ట్ : సీఎం రేవంత్ రెడ్డి

 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్త‌య్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్ల‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్క‌టి చొప్పున వైఐఐఆర్‌ ఎస్ ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేన‌న్నారు. ప్ర‌స్తుతం బాలిక‌ల‌కు స్కూల్స్ కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో విడ‌తలో బాలుర‌కు కేటాయించాల‌న్నారు. 

విద్యా శాఖ‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో  ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. వైఐఐఆర్‌సీలో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్‌లో చేప‌ట్టే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. వైఐఐఆర్ ఎస్ ల నిర్మాణాల‌కు సంబంధించి బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేయాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్ర‌స్తుతం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా అమ‌లు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని తెలంగాణ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు. 

త‌గినంత స్థ‌లం, అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు అంద‌జేస్తే ప‌థ‌కాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయ‌గ‌ల‌మ‌ని అక్ష‌య‌పాత్ర ప్ర‌తినిధులు సీఎంకు తెలియ‌జేశారు. ప్ర‌తి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అంద‌రికీ స‌కాలంలో భోజ‌నం అందేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎక‌రాల స్థ‌లం కేటాయింపు లేదా 99 సంవ‌త్స‌రాల‌కు లీజు  తీసుకునే అంశంపై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుకు ముఖ్య‌మంత్రి సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 23 నూత‌న పాఠ‌శాల భ‌వ‌నాలు నిర్మాణాలు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి అందుబాటులోకి రావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

బాచుప‌ల్లి పాఠ‌శాల స్థ‌లం కేవ‌లం అర ఎక‌రం మాత్ర‌మే ఉండ‌డంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎక్క‌డైనా పాఠ‌శాల‌కు క‌నీసం ఎక‌రంన్న‌ర స్థ‌లం ఉండాల‌ని, బాచుపల్లి ప్ర‌స్తుతం ఉన్న స్థ‌లం స‌మీపంలో ఎక‌రంన్న‌ర ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు సిల‌బ‌స్ మార్పుపై క‌స‌ర‌త్తును వెంట‌నే ప్రారంభించాల‌ని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆయన సూచించారు.

 పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో నూత‌న కోర్సులు, మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాల‌జీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వ‌ర‌గా అమ‌ల‌య్యేలా చూడాల‌ని  ఆదేశించారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి విద్యార్థికి క‌చ్చితంగా ఉద్యోగం ల‌భించేలా సిల‌బ‌స్, బోధ‌న ఉండాల‌ని సీఎం అన్నారు. 

ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కే. కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి కృష్ణ ఆదిత్య‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్‌, ఉస్మానియా విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్‌ మొలుగారం కుమార్‌, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ వి.ఎల్‌.వి.ఎస్‌.ఎస్‌.సుబ్బారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.
  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu