ఆ ఒక్క ట్వీట్ 18 కోట్లు పలికింది.. స్పెషాలిటీ ఏంటంటే..
posted on Mar 23, 2021 6:00PM
ఈరోజుల్లో దేశ ప్రధానులు, అధ్యక్షుల నుండి సెలబ్రిటీలు స్పోర్ట్స్ పర్సన్స్ వరకు ఒక్క ట్వీట్ చేసారంటే ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. ఇక ట్రంప్ వంటి పొలిటీషియన్ అయితే ఇక ఆ రచ్చ మాములుగా ఉండదు. ఇంకోపక్క నేతలు, సెలబ్రిటీల మధ్య తమ ఫాలోవర్ల సంఖ్యకు సంబంధించి ప్రతి నిత్యం పోటీనే...
ఇది ఇలా ఉండగా ట్విట్టర్ లాంచ్ చేసిన తరువాత ప్రపంచంలో మొట్టమొదటి ట్వీట్ను పోస్ట్ చేసి ఈరోజుకి సరిగ్గా 15 ఏళ్లు గడిచాయి. 2006 మార్చి 22న ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే "జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విటర్" అనే ఒక మెసేజ్ను ట్వీట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు ట్విట్టర్ అలాగే జాక్ డోర్సే వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్విటర్ కూడా ఒకటి. ఇది ఇలా ఉండగా. మొట్టమొదటి ట్వీట్ చేసి 15 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా జాక్ డోర్సే ఈ నెల ఆరో తేదీన తాను చేసిన మొదటి ట్వీట్ ను వేలానికి పెట్టారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ట్వీట్ ఏకంగా రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ ట్వీట్ యొక్క డిజిటల్ సెర్టిఫికెట్ ను బ్రిడ్జ్ ఒరాకిల్ కంపెనీ సిఇవో సినా ఎస్తావి సొంతం చేసుకున్నారు. దీంతో ఈ వార్త కాస్తా.. ఒక్కసారిగా ట్విటర్లోనే ట్రెండ్ అయింది. అయితే వేలం ద్వారా వచ్చిన ఈ సొమ్ము మొత్తాన్ని జాక్ డోర్సే చారిటీకి విరాళంగా ఇవ్వనున్నారు.