అంతర్వేది రథానికి నిప్పు పెట్టించింది బాబే.. విజయసాయి రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

ఏపీలో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్దం అయిన విషయం అక్కడి రాజకీయాల్లో రచ్చ రేపుతోంది. ఈ ఘటన కు మీరు కారణం అంటే కాదు మీరని అదికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

 

తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులను కూల్చి, అమరేశ్వరుడి భూములను మింగి, పుష్కరాల్లో ఏకంగా 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఈ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు అంటూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విజయసాయి రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే చంద్రబాబు గారు నిజ నిర్ధారణ కమిటీ వేశారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినా కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు అంటూ బాబును ఘాటుగా విమర్శిస్తూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు.

 

అంతేకాకుండా రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతర్వేది ఘటనలో దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు. కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోంది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.