ఆర్టీసీ 'ఛలో ట్యాంక్ బ్యాండ్' లో ఉద్రిక్తత.. పలువురికి గాయాలు
posted on Nov 9, 2019 3:11PM
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు.. కార్మికులు.. నవంబర్ 9న ఛలో ట్యాంక్ బండ్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతిని నిరాకరించారు. అయినప్పటికీ భారీగా కార్మికులు ట్యాంక్బండ్ చేరుకున్నారు. ఈ క్రమంలో ట్యాంక్బండ్పై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అన్ని దారుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ కు చేరుకోలేని విధంగా చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసినా..ఆర్టీసీ నేతలు , కార్మికులు వాటి పైనుంచి దూకి వెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో ట్యాంక్ బండ్వైపు వచ్చే అన్ని రహదారులను కూడా మూసేశారు. ఇప్పుడిప్పుడే కార్మికులు, పలు సంఘాల నేతలు ట్యాంక్బండ్కు చేరుకుంటున్నారు. మరోవైపు ట్యాంక్బండ్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
సెక్రటేరియట్ బస్టాప్ నుంచి ట్యాంక్ బండ్పైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు ఓయూ జేఏసీ నేతలు ట్యాంక్ బండ్పై సొమ్మసిలి పడిపోయారు. ఆర్టీసీ క్రాస్రోడ్డు నుంచి తమ్మినేని వీరభద్రం, విమలక్క ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్రోడ్డులో పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ట్యాంక్ బండ్ వైపు నాయకులు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.