బద్వేల్లో హోరాహోరీ ఫైట్!.. జగన్కు తప్పదా షాక్?
posted on Sep 28, 2021 12:25PM
ఉప ఎన్నిక అనగానే వైసీపీలో ఏ మూలనో టెన్షన్ టెన్షన్. గెలుస్తామనే నమ్మకం ఉన్నా.. ఏదో గెలిచాం చాలన్నట్టు.. గెలిచి ఓడినంత పని అవుతోంది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. రెండు లక్షల మెజార్టీతో గెలిచామని విర్రవీగే పరిస్థితి లేకుండా పోయింది. ఎలక్షన్కు ముందు 6 లక్షల మెజార్టీ వస్తుందని మంత్రులు ఫోజులు కొట్టారు. ప్రచారం మొదలయ్యేసరికి ఆ ఫిగర్ తగ్గుకుంటూ పోయింది. 4 లక్షల ఆధిక్యం పక్కా అన్నారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రంగంలోకి దిగి.. ర్యాలీలు, సభలతో హోరెత్తించడం.. తిరుపతి ఎంపీ నియోజకవర్గమంతా పసుపుమయంగా మారడం.. టీడీపీ ర్యాలీలకు జనం తండోపతండాలుగా రావడం చూసి.. ఓ దశలో వైసీపీకి ఓడిపోతామేమోననే వణుకు మొదలైంది. అందుకే కాబోలు.. ఓడితే పరువంతా పోతుందనే భయంతో.. పోలింగ్ నాడు పక్క జిల్లాల నుంచి బస్సుల్లో జనాలను తీసుకొచ్చి మరీ దొంగఓట్లతో గట్టేక్కారు. ఇక వైసీపీకి ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు దక్కవనే బెదిరింపులు, వాలంటీర్లతో వార్నింగులు, తాయిలాలు, పందేరాలు.. ఇలా తిరుపతిలో గెలుపు కోసం వైసీపీ చేయని కుట్ర, కుతంత్రాలు లేవు. అన్ని చేసినా.. 6 లక్షల మెజార్టీ అని గొప్పలు చెప్పినా.. చివరాఖరికి 2 లక్షల మెజార్టీతో బయటపడ్డారు. గెలిచి ఓడారు. ఆ ఎన్నిక సజావుగా జరిగుంటే టీడీపీనే గెలిచుండేదని అంతా అన్నారు.
తిరుపతి జ్ఞాపకం మరవక ముందే.. తాజాగా బద్వేలు ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 30న పోలింగ్. నవంబర్ 2న కౌంటింగ్ అండ్ రిజల్ట్స్. బద్వేలు కడప జిల్లాలో ఉండటంతో సీఎం జగన్కు ఈ ఎన్నిక సవాలేనని చెప్పాలి. కడప జిల్లాలో వైసీపీకి గట్టి పట్టున్న మాట వాస్తవమే. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయారనే సానుభూతి అదనపు బలం. అయినా, ఈజీగా గెలుస్తామనే ధీమా మాత్రం అధికారపార్టీలో కనిపించడం లేదు. టీడీపీకి పట్టుందని కాదు కానీ.. వైసీపీపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహమే ఆ పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది.
అసలే రాయలసీమ. ఉపాధి అంతంత మాత్రమే. ఇసుక పాలసీ అంటూ ఇసుక దొరక్కుండా చేసి రోజు కూలీలకు ఉపాధి లేకుండా చేసిన ఘనత జగన్దే. ఇక ధరల పెంపు, చెత్త పన్నులు, అప్పులు, జీతాలు సమయానికి రాకపోవడం.. ఇలా ప్రతీ ఒక్క వర్గమూ జగన్ పాలనపై ఆగ్రహంగానే ఉంది. ఇక మద్యం తాగే అలవాటున్న ప్రతీఒక్కరు.. మందు తాగే ప్రతీసారి.. జగన్ను తిట్టకుండా ఉండటం లేదు. అడ్డగోలుగా ధరలు పెంచేసి.. అడ్డమైన బ్రాండ్లు తీసుకొచ్చి.. మందుబాబుల పాలిట విలన్ అయ్యారు జగన్.
ఇలా ప్రజాగ్ని ఉప ఎన్నిక వచ్చినప్పుడే బయటపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేయలేము. ఎమ్మెల్యే ఎలక్షన్ సీఎంతో లింకుంటుంది కాబట్టి.. ముఖ్యమంత్రి పనితీరుకు రెఫరెండంగా భావిస్తుంటారు. గతంలో తెలంగాణలో అదే జరిగింది. దుబ్బాకలో టీఆర్ఎస్ను ఓడించి కేసీఆర్కు షాక్ ఇచ్చినట్టు.. బద్వేలులో వైసీపీకి బుద్దిచెప్పి జగన్కు ఝలక్ ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, అధికార పార్టీలో టెన్షన్ నెలకొందని అంటున్నారు.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పేరును వైసీపీ దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఇక, టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరును ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. అభ్యర్థులు దాదాపు కన్ఫామ్ కావడంతో ఇక అసలైన పోరు మొదలుకానుంది.