అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ! రహస్యంగా పోలీసుల విచారణ
posted on Jan 30, 2021 1:27PM
అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలో భారీ చోరీ జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో ఈ చోరీ జరగడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడిన దుండగులు.. లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు డబ్బును ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు రహాస్యంగా దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ చోరీ జరిగింది. ఇటీవలే కొత్తగా నిర్మించిన ఈ క్వార్టర్ట్స్ లో మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు 305 ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆ ఫ్లాట్లో ఎమ్మెల్యే బంధువు అమర్నాథ్ బాబు కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లాట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోకి వెళ్లిన దొంగలు 14.6 తులాల బంగారం, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు.
పోలీసులు పదుల సంఖ్యలో ఉండే క్వార్టర్ట్స్లో చోరీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమర్నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేసిన తాళాలు వేసినట్లు ఉండడం, లోపలికి ఎవరూ రాకపోవడంతో ఇంటిదొంగ పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ డ్రైవర్ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు అమర్ నాథ్. ప్రస్తుతం డ్రైవర్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో పోలీసులు అతనిపై అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఆబిడ్స్ ఏసీపీ వెంకట్రెడ్డి, నారాయణగూడ సీఐ రమేశ్కుమార్ వివరాలు వెల్లడించడం లేదు.