తెలంగాణా కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి
posted on Jul 26, 2012 5:01PM
కాంగ్రెస్ పార్టీ తెలంగాణా జిలల్లాల్లో ఇప్పటికే సమస్యల్లో పడిరది. దీనికి తోడు నామినేటెడ్ పదవల పంపకంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పడూ పార్టీ ఆఫీసుల్లో చూడని వారిని జండాలు మోయని వారిని నామినేటెడ్ పోస్టుల్లో వేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నాయకులకు బందువులుగా ఉన్నవారిని, డబ్బున్న వారినే నాయకులు సిఫార్సులు చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఇంకా నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయకపోవడం పై వారు అసహనంగా ఉన్నారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్ధానాలు పొందింది. దీని వెనుక కార్యకర్తల కృషి ఎన్నతగినది. అయినా పదవులకు మాత్రం వారు దూరంగానే ఉండాల్సి వస్తుంది.
గత ఎన్నికల్లో పరాజయంపాలైన రేణుకా చౌదరి తన వారికి పదవుల పట్టం కట్టటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేకోవలో తెలంగాణలోని సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కకూడా ఉన్నారు. ఈ పరిణామంతో పార్టీకింది స్థాయినుంచి బలహీనపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెట్ కమిటి చైర్మన్, ఎపిఐడిసి, ఎపిఐఐసి, మైనింగ్ కార్పోరేషన్, సివిల్సప్లై కార్పొరేషన్, యస్ సి కార్పొరేషన్ లాంటి పదవులు, దేవాదాయ కమిటీ చైర్మన్లు, గ్రంధాలయ సంస్దల చైర్మన్లు కాళీగా ఉన్నాయి. నామినేటెడ్ పదవుల భర్త్తీ అయితేనే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నిండుతుందని రాష్ట్రనాయకులు ఆలోచిస్తుండగా, కార్యకర్తలు తమను కాకుండా జిల్లానాయకులు వారి బందువులనే నామినేట్ చేస్తున్నారని ఆరోపించడం కొసమెరుపు.