మలేసియా ఓపెన్..సెమీస్ లో పీవీ సింధు ఓటమి
posted on Jan 10, 2026 11:20AM
.webp)
ప్రంపంచ బాడ్మింటన్ సీజన్ ఆరంభ టోర్నీ.. మలేషియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ పోరాటం ముగిసింది. శనివారం (జనవరి 10) ఇక్కడ జరిగిన సెమీఫైనల్ లో ఆమె పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెమీ ఫైనల్ లో సింధు డ్రాగన్ షట్లర్ వాంగ్ జియి చేతిలో 16- 21, 15-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. గాయం కారణంగా సుదీర్ఘ కాలం విరామం తీసుకున్న సింధూ మలేషియా టోర్నీలో పునరాగమనం చేసింది.
ఈ టోర్నీలో ఆరంభ మ్యాచ్ లలో అదరగొట్టి సెమీస్ కు దూసుకెళ్లింది. పూర్వపు ఫామ్ అంది పుచ్చుకున్నట్లుగా సింధు కనిపించడంతో సంక్రాంతి కానుకగా ఆమె మలేషియా ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచి స్వదేశానికి తిరిగివస్తుందని అంతా ఆశించారు. అయితే ఆమె సెమీఫైనల్ లో ఓడిపోవడంతో నిరాశ చెందారు. ఇలా ఉండగా మలేషియా ఓపెన్లో 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా సింధు సెమీఫైనల్ కు చేరుకుంది. ఇక లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో సత్తా చాటి మరో ఒలింపిక్ మెడల్ ను తన ఖాతాలో వేసుకోవాలని సింధు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ సింధు ఖాతాలో రెండు ఒలింపిక్ మెడల్స్ ఉన్న సంగతి తెలిసిందే.