విడదల రజినిపై విచారణకు ఆదేశం

మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె తమను భయపెట్టి, బెదిరించి, కోట్లాది రూపాయపలు వసూలు చేశారంటూ పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు హోంమంత్రి అనితకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.  తమ ప్రాణాలకు విడదల రజిని వల్ల హాని ఉందని, రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన హోం శాఖ మంత్రి అనిత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

విడదల రజినిపై ఫిర్యాదు చేసిన చలపతిరావు మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి 2010 సంవత్సరం నుంచి ఎడ్లపాడు గ్రామంలో స్టోన్ క్రషర్ వ్యాపార సంస్థను నడుపుతున్నారు. 2020 సెప్టెంబర్ 9న అప్పటి ఎమ్మెల్యే విడదల రజనీ పిఏ దొడ్డా రామకృష్ణ క్రషర్ వద్దకు వచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యే కలవమంటున్నారు అని చెప్పారు. దీంతో వారు రజనీని ఆమె ఆఫీసులో కలిశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు కలవలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వ్యాపారం చేసుకోవాలంటే తనకు డబ్బు ఇవ్వాలని ఆమె చెప్పారు. తన పిఏ చెప్పినట్టుగా చేయాలని చెప్పి పంపేశారు.  వారు విడదల రజని పీఏతో కలిస్తే, ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారు. అంత డబ్బు చెల్లించలేమని చెప్పిన క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించారు. వ్యాపారం ఎలా చేస్తారో.. మీ అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు విచారణకు ఆదేశించింది.