ఆదిమూలం మీద అత్యాచారం కేసు కొట్టివేత!

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద వరలక్ష్మి అనే మహిళ పెట్టిన అత్యాచారం కేసును హైకోర్టు కొట్టేసింది. ఆదిమూలం మీద కేసు పెట్టిన వరలక్ష్మి కాంప్రమైజ్ కావడంతో హైకోర్టు కేసును కొట్టేసింది. కొద్దిరోజుల క్రితం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి చెందిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసింది. ఆ వీడియోలో ఆదిమూలం ఒక మహిళతో సన్నిహితంగా వున్నట్టు కనిపించింది. ఆ తర్వాత వరలక్ష్మి అనే మహిళ బయటకి వచ్చింది. కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని, అత్యాచారం జరిపారని ప్రకటించింది. ఆ తర్వాత ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టింది. ఆమె కేసు అయితే పెట్టిందిగానీ, ఆ తర్వాత వైద్య పరీక్షలకు హాజరు కావడానికి ఆమె తాత్సారం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద సస్పెన్షన్ వేటు వేశారు. వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరిన ఆదిమూలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని, తిరిగి వైసీపీకి వెళ్ళనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఎవరూ ఊహించని పరిణామం జరిగింది. ఆదిమూలం మీద కేసు పెట్టిన మహిళ కాంప్రమైజ్ అవడంతో ఆదిమూలం మీద వున్న అత్యాచారం కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది.