మీడియా సమావేశంలో ఒబామా ప్రసంగం ఇది...

 

భారత పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైన అనంతరం మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఆ ప్రసంగం ఇలా సాగింది.... నమస్తే.. మేరా ప్యారా భాయీ ప్రధాని నరేంద్ర మోదీకి, 'చాయ్పే చర్చా' బాగా జరిగింది. ఇలాంటివి వైట్హౌస్లో కూడా జరగాలి. ఇండియాతో బంధం మరింత దృఢపరుచుకోవడం నా హయాంలో జరుగుతున్నందుకు సంతోషంగా వుంది. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు ఇండియాకి వచ్చిన మొదటి అధ్యక్షుడిని నేనే కావడం ఆనందకరం. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడం కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అమెరికా, భారత్ దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. అణు విస్తరణ విషయంలో కూడా రెండు దేశాల మధ్య బంధం బలోపేతమైంది. గత నెలలో మోడీజీ వాషింగ్టన్ వచ్చినప్పుడు, అక్కడ న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్లో ఆయన ప్రసంగానికి సినీ స్టార్కు వచ్చినట్లుగా జనం రావడం చూసి ఆశ్చర్యపోయాం. ఇప్పటికే రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇది మరింత పెరగాలని ఆశిస్తున్నాం. ఇండియాతో మరింత హైటెక్ సహకారం ఉంటుంది. స్వచ్ఛమైన ఇంధనం విషయంలో కూడా మా సహకారం పూర్తిగా ఉంటుంది. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులు మరిన్ని ప్రారంభం అవుతాయి. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాం. మరో పదేళ్ల పాటు కూడా ఇలాగే సహకారం కొనసాగాలని భావిస్తున్నాం. రక్షణ రంగంలోను, అణు రంగంలోను కూడా మా సహకారం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని భారతీయులకు మరోసారి చెబుతున్నాను’’ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu