పేదవాడి అన్నం ముద్ద ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ ఈ పేరు ఒక ఉత్సాహం. ఈ పేరు ఒక ఉద్వేగం. ఈ పేరు ఒక చరిత్ర. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు జనం హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహామనిషి. ఆయన శత జయంతి నేడు.     కృష్ణా నదీతీరాన  జన్మించిన నందమూరి తారక రామా  బాల్యం నుండీ శ్రమజీవి. కుటుంబానికి అండగా, పొరుగువారికి సాయం చేయడానికి సదా సిద్ధంగా ఉండేవారు.

ఇక చలన చిత్ర రంగం లో కి ప్రవేశించిన తరువాత ఆయన అశేష ఆంధ్రుల ఆరాధ్య దైవం అయ్యారు.  అగ్ర హీరోగా యమా బిజీగా ఉన్న సమయంలో కూడా ఎన్టీఆర్  సామాజిక బాద్యతను విడవ లేదు. దివిసీమ ఉప్పెన సృష్టించిన పెను విషాదం లో  జోలె పట్టి సర్వసం కోల్పోయిన కుటుంబాల  కోసం విరాళాలు సేకరించి ఆదుకున్నారు.  1982లో  తెలుగు దేశం పార్టీ స్థాపించి రాజకీయాలలోకి ప్రవేశించారు.   9 నెలల్లో దశాబ్దాలు గా అధికారం లో ఉన్న పార్టీ నీ కూకటి వేళ్ళతో పెకిలించి చరిత తిరగ రాశారు. నేడు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల సంక్షేమ పథకాలకూ ఎన్టీఆర్ పథకాలే ఆదర్శం.   పేదలకు రూ.2 రూపాయలకే బియ్యం అందించి  ఎన్టీఆర్ పేదవాడి అన్నం ముద్దగా మారిపోయారు.  

జనం గుండెల్లో దైవ సమానుడిగా కొలువయ్యారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా ప్రజల సంక్షేమం, ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజల కోసం పని చేస్తూనే ఉంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీని జనం గుండెల్లో దాచుకున్నారు. దేశ రాజకీయాలలో సంక్షేమం కోణాన్ని ఆవిష్కరించింది ఎన్టీఆర్ అనడంలో సందేహం లేదు. వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాలలో పెద్ద పీట వేసిన వ్యక్తి ఎన్టీఆర్.

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పునరంకితం అవుదామన్న సంకల్పంతో తెలుగుదేశం పార్టీ మహానాడులో శనివారం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించుకుంటోంది. మహానాడు ప్రాంగణంలో వేదికపై ఎన్టీఆర్ ప్రతిమ, ప్రాంగణం అంతా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, మహానాడుకు హాజరైన తెలుగు తమ్ముళ్ల చేతిలో ఎన్టీఆర్ చిత్రపటాలు...జనం గుండెళ్లో ఆయన కొలువై ఉన్నారనడానికి నిదర్శనాలు.