తెలంగాణలో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
posted on May 5, 2025 7:49PM

ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఇవాళ సాయంత్రం కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురై జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడతో పాటు రుద్రంగి ప్రాంతాల్లో సుమారు ఐదు సెకన్ల పాటు భూమి తీవ్రంగా కదలడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో ఇళ్లల్లోని వస్తువులు సైతం స్వల్పంగా కదలడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించిన అనుభవం చాలా భయానకంగా ఉందని స్థానికులు తెలిపారు.
స్వల్ప భూకంపం కారణంగానే ఈ ప్రకంపనలు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.అయితే, ఈ భూకంపం ప్రభావం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. ప్రజలు భయాందోళనలతో ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాజా సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైంది.