కిడారి, సోమల హత్యపై మావోయిస్టుల ప్రకటన

 

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.గతంలో ఈ హత్యలపై మావోయిస్టుల పేరుతో ఓ లేఖ వెలువడింది.దాన్ని పోలీసులు మావోయిస్టుల నుంచి వచ్చిన లేఖ కాదని ధ్రువీకరించారు.కానీ తాజాగా ఈ హత్యలపై ఏవోబీ మావోయిస్టుల పేరుతో మీడియాకు లేఖ అందింది.ప్రభుత్వ హింసాకాండకు జవాబుగానే కిడారి, సోమలను హత్యచేసినట్టు సీపీఐ మావోయిస్టు ఏవోబీ ప్రతినిధి జగబంధు లేఖలో వెల్లడించారు.మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు ఆగిపోయిన విషయా న్ని ఆ లేఖలో అంగీకరించారు. అయితే, లేటరైట్‌, గ్రానైట్‌, రంగురాళ్లు వంటి విలువైన సహజ ఖనిజాలను అధికార పార్టీ నాయకులు అక్రమంగా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ‘‘ఎమ్మెల్యే కిడారి లేటరైట్‌, గ్రానైట్‌, రంగురాళ్ల క్వారీలను నిర్వహించారు. ఆ క్వారీలను నిలిపివేయాలంటూ ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు.ఈ సమస్యపై పోరాడుతున్న స్థానికులు, సంఘాలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది. ఈ అణచివేతకు ప్రతిఘటనగానే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలపై చర్య తీసుకొన్నాం’’ అని జగబంధు వివరించారు.