త‌మిళ న‌టుడిని పెళ్లాడిన మ‌ధుశాలిని

 

నటి మధుశాలిని జూన్ 16న త‌మిళ‌ నటుడు గోకుల్ ఆనంద్‌ను వివాహం చేసుకుంది. హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తగా పెళ్లయిన త‌మ జంట ఫోటోను షేర్ చేస్తూ, మధు శాలిని "మాకు లభించిన ప్రేమకు ధన్యవాదాలు. మా హృదయాలలో ఆశ, కృతజ్ఞతతో కూడిన మా జీవితంలోని కొత్త అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. లవ్ మధు షాలిని & గోకుల్ ." అంటూ ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చింది.

మ‌ధుశాలిని ఎరుపు రంగు వెల్వెట్ దుస్తులలో అద్భుతంగా కనిపించగా, వరుడు సంప్ర‌దాయ‌ ప్రింటెడ్ దుస్తులలో ఆమెతో పాటు వచ్చాడు. వారి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలను తెలియ‌జేశారు. 

ఈ జంట 2019 తమిళ డ్రామా 'పంచరాక్షరం'లో క‌లిసి న‌టించింది. 2019 డిసెంబర్ 27న విడుదలైన ఈ చిత్రాన్ని పారడాక్స్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై వైరముత్తు నిర్మించారు. బాలాజీ వైరముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా న‌టించ‌గా, అశ్విన్ జెరోమ్, సనా అల్తాఫ్, సీమాన్, రాజా, జీవ రవి ఇత‌ర‌ పాత్రల్లో నటించారు. ఆ సినిమాలో న‌టించేట‌ప్పుడే గోకుల్‌తో ప్రేమ‌లో ప‌డింది మ‌ధుశాలిని.

గోకుల్ ఆనంద్ 2017 తమిళ చిత్రం, 'చెన్నై 2 సింగపూర్‌'తో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత 2021 మిస్టరీ చిత్రం 'తిట్టమ్ ఇరందు', 'నడువన్' వంటి చిత్రాలలో చిన్న పాత్రలలో కనిపించాడు. 

ఇక మ‌ధుశాలిని టీవీ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్నాక‌, 'కిత‌కిత‌లు' సినిమాతో వెలుగులోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత స్టేట్ రౌడీ, కింగ్‌, అనుక్ష‌ణం, గోపాల గోపాల‌, చీక‌టి రాజ్యం, గూఢ‌చారి చిత్రాల‌లో ప్రాముఖ్యం ఉన్న పాత్ర‌ల్లో న‌టించింది. ఇటీవ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వ‌చ్చిన '9 అవ‌ర్స్' వెబ్ సిరీస్‌లో జ‌ర్న‌లిస్టుగా న‌టించి, త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.