లాలూకి మరో ఎదురుదెబ్బ..
posted on Jul 7, 2017 10:39AM

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి లాలూకు ఎదురుదెబ్బ తగిలింది. లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంపై ఈరోజు సీబీఐ దాడులు చేయడం కలకలం రేపుతోంది. పాట్నాలోని లాలూ నివాసంతో పాటు ఆయనకు చెందిన 12 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పురి ప్రాంతాల్లో హోటళ్ల టెండర్ల విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు.. రైల్వేకు చెందిన రెండు హోటళ్లను ప్రైవేట్ హాస్పిటాలిటీ గ్రూప్కు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. హోటళ్లను ఎక్స్చేంజ్ చేయడం కోసం ఈ హాస్పిటాలిటీ గ్రూప్ పాట్నాలోని రెండు ఎకరాల విలువైన భూమిని లాలూ సంస్థలకు లంచంగా ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.