చిక్కుల్లో కే.వి.పి.వియ్యంకుడు
posted on Jul 14, 2012 10:21AM
దివంగతం వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆత్మ స్నేహితుడైన కే.వి.పి. రామచంద్రరావు వియ్యంకుడు రఘురామ రాజు చిక్కుల్లో పడ్డారు. జగన్ అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న జె.డి.లక్ష్మీనారాయణ సెల్ఫోన్ కాల్ లిస్ట్ను బైట పెట్టిన రఘురామరాజు ఇప్పుడు తీవ్ర టెన్షన్కు గువరుతున్నట్లు తెలిసింది. అనవసరంగా లక్ష్మీనారాయణతో పెట్టుకున్నానని ఆయన తనను వదిలిపెట్టేటట్లు లేడని రఘురామరాజు వాపోతున్నట్లు తెలిసింది. ఎమ్మార్ విల్లాలను కొనుగోలు చేసిన రఘురామ రాజు ఆ కేసు విషయమై గతంలో సి.బి.ఐ. ఎదుట హాజరయ్యారు. అప్పట్లో లక్ష్మీనారాయణ విచారణ పేరిట రఘురామరాజును వేధించారు. దీనిని మనసులో పెట్టుకున్న రఘరామరాజు అప్పట్లో లక్షీనారాయణపై కోర్టులో కేసు వేస్తూ తనకు వ్యతిరేకంగా ఆయనతో పాటు ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జె.డి ఉద్దేశ్య పూర్వకంగా విచారణ సమాచారాన్ని ఆంధ్రజ్యోతికి లీక్ చేస్తున్నారని చెబుతూ తన వాదనలకు మద్దతుగా అప్పట్లో జె.డి. కాల్ లిస్ట్ను కోర్టుకు సమర్పించారు.
దీంతో ఈ కేసుపై ఒక అడుగు వెనుకకు వేసిన జె.డి. లక్షీనారాయణ తాను విచారణ సమాచారాన్ని మీడియాకు లీక్ చేయలేదని కోర్టుకు చెప్పారు. జె.డి. సమాధానంతో సంతృప్తి చెందిన రఘురామరాజు అప్పట్లో తన కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి జె.డి. లక్ష్మీనారాయణ తన హిట్లిస్ట్లో రఘురామరాజును పెట్టుకున్నారు. సమయం కోసం వేచి చూస్తుండగా సాక్షిమీడియా జె.డి. కాల్ లిస్ట్ను బైట పెట్టింది. దీని సాకుగా తీసుకుని జె.డి. సాక్షిమీడియా ప్రతినిధి, ఒక సి.ఐ.తో పాటు రఘురామరాజుపై కూడా కేసు పెట్టారు. దీంతో బెంబేలెత్తి పోయిన రఘురామరాజు ఈ కేసులో తన పేరును తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయగా శుక్రవారం కోర్టు దానిని కొట్టి వేసింది. ఈ కేసుకొట్టి వేయడంతో రఘురామరాజు డీలా పడినట్లు తెలిసింది. క్షత్రియుడైన రఘురామరాజు తన కుమార్తెను వెలమ కులానికి చెందిన కే.వి.పి. రామచంద్రరావు కుమారిడికి ఇచ్చి వివాహం చేశారు. వై.ఎస్. హయాంలో రఘు రామరాజు కూడా బాగా లబ్ది పొందినట్లు సమాచారం.