పిల్లల బూచాడు దొరికాడు..

 

పిల్లలను కిడ్నాప్ చేసిన ఓ కిడ్నాపర్ని పోలీసులు తెనాలిలో పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కి తరలిస్తున్న ఒక వ్యక్తిని గుంటూరు జిల్లా తెనాలి ఆర్.పి.ఎఫ్. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చీరాల సమీపంలోని ఇంకొల్లుకు చెందిన తప్పిట శ్రీను అనే కిడ్నాపర్ చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని పార్కులో ఆడుకుంటున్న తిరువీధుల గిరీష్, లహరి, ఆర్షియా అనే పిల్లల్ని ఆదివారం మధ్యాహ్నం కిడ్నాప్ చేశాడు. వారిని హైదరాబాద్‌కి తరలించడానికి తెనాలి రైల్వేస్టేషన్‌కి వచ్చాడు. ప్లాట్‌ఫామ్ మీద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతన్ని పట్టుకున్న రైల్వే పోలీసులు విచారించడంతో అతను పిల్లల్ని కిడ్నాప్ చేశాడన్న విషయం తెలిసింది. దాంతో ముగ్గురు పిల్లలకు అతని నుంచి విముక్తి కల్పించారు. కిడ్నాపర్ పోలీసుల అదుపులో వున్నాడు.