సునంద కథతో వర్మ సినిమా

 

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మర్డర్ మిస్టరీ రకరకాల మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. సునంద పుష్కర్‌ది మొదట్లో సహజ మరణం అని భావించారు. ఆ తర్వాత అనుమానాస్పద మృతి అన్నారు. చివరికి అది హత్య అని పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య వెనుక శశి థరూర్ హస్తం వుండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సునందా పుష్కర్ జీవిత కథ నేపథ్యంతో ఓ సినిమాని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సమాజంలో ఏ సంచలన ఘటన జరిగినా దాన్ని సినిమాగా తీసేయాలని తహతహలాడే రామ్‌గోపాల్ వర్మకు సునంద పుష్కర్ వ్యవహారం లడ్డులా దొరికినట్టుంది. అయితే సునందా పుష్కర్ మరణంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే తాను సినిమా కథను తయారు చేస్తానని వర్మ అంటున్నారట. ముంబైలో తాజ్ హోటల్ మీద దాడులు జరిగిన సమయంలో రామ్‌గోపాల్ వర్మ అప్పటి ముఖ్యమంత్రితో కలసి తాజ్ ‌హోటల్‌ని సందర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వర్మ ఆ ఘటనపై సినిమా రూపొందించే పనిలో వున్నాడు.