కేసీఆర్...చరిత్ర తెలుసుకో
posted on Sep 21, 2013 11:25AM
'తెలంగాణ ఉద్యమం 50 సంవత్సరాల నుంచి ఉందా? చరిత్ర తెలుసుకోండి! తెలుగు జాతి ఐక్యంగా ఉండాలనే ఉద్యమానికి వందేళ్ల చరిత్ర ఉంది. అసలు తెలుగు జాతి ఎందుకు విడిపోవాలి? తెలుగు మన భాష. రాయలసీమలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, కోస్తాలో ఉన్నా అందరూ ఆంద్రులే. వారంతా మాట్లాడేది తెలుగే. ఇది విభజనవాదులు తెలుసుకోవాలి'' అని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి సూచించారు.
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. 'తెలంగాణవాలె జాగో... ఆంధ్రావాలే బాగో' అని గతంలో నినదించిన కేసీఆర్పై మండిపడ్డారు. దీనిని తిరగరాద్దామంటూ... 'తెలుగువాలే జాగో... కేసీఆర్ బాగో' అని నినదించారు. విభజన ఆగాలంటే సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. "1913-1914లోనే విజయవాడలో విశాలాంధ్ర మహాసభకు అంకురార్పణ జరిగింది.
అప్పట్లో కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం పోరాడితే, దానికి సమాంతరంగా తెలుగుజాతి ఐక్యత కోసం విశాలాంధ్ర మహాసభ ఉద్యమించింది'' అని తెలిపారు. హైదరాబాద్పై అవగాహన లేని వారు రకరకాల వాదనలు చేస్తున్నారని విమర్శించారు. "కులీ కుతుబ్ షాహీలు, ఆ తర్వాత నిజాంల పాలనలో తెలుగువారంతా కట్టిన పన్నులవల్లే హైదరాబాద్లో నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడున్న హైటెక్ సిటీ మాత్రమే కాదు... గోల్కొండ, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం అన్నీ మనవే'' అని నొక్కిచెప్పారు.