అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి చంద్రబాబు.. జ్యోతుల
posted on Oct 31, 2015 5:17PM

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాల శకం ముగిసిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క బీహార్ కే కాదు.. ఈ వ్యాఖ్యలు ఏపీకి కూడా వర్తిస్తాయి అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీకి కూడా ప్రత్యేక హోదా వస్తుందో? లేదో అని సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ విషయంపై వైకాపా నేత జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ ప్రత్యేక హోదాపై అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం స్పంష్టం చేస్తారు అని డిమాండ్ చేస్తారు. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం లేదని.. దీనికి చంద్రబాబు స్పందన ఏంటని అన్నారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?రాదా? వస్తే ఎన్ని రోజుల్లో సాధించగలరు? అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై నీతి అయోగ్ కమిటీ సమీక్షిస్తుందని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఇప్పుడైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు.