మరోసారి సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి ఫైర్...
posted on Mar 17, 2017 5:32PM

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ మరోసారి సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు బెయిలబుల్ వారెంట్ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇప్పుడు కూడా ఆయన సుప్రీం కోర్టుతో ఘర్షణ, ధిక్కార వైఖరిని కొనసాగిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పశ్చిమబెంగాల్ డీజీపీ సురజిత్ కర్ పురకాయస్తా, కోల్కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు.. బెయిలబుల్ వారెంట్ అందజేసేందుకు జస్టిస్ కర్ణన్ నివాసానికి వెళ్లగా.. వారెంట్ తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వారెంట్ జారీ చేయడం చట్టవిరుద్ధమని, ఓ దళిత జడ్జిని వేధించడమేనని...సుప్రీంకోర్టు ప్రపంచం ముందు నవ్వుల పాలైందని అన్నారు. తాను న్యాయస్థానం ముందు ఎందుకు హాజరు కావాలని ఎదురు ప్రశ్నించారు.