ఎక్కడకీ వెళ్లలేదు.. బెంగళూరులోనే ఉన్నా: గాలి

 

ప్రజలను కోట్ల రూపాయలకు మోసం చేసిన అంబిడెంట్‌ కంపెనీపై ఈడీ కేసులు కొట్టివేయిస్తానని జనార్దన్‌ రెడ్డి రూ. 20 కోట్లకు బేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అరెస్టు భయంతో గాలి, ఆయన అనుచరులు రహస్య ప్రదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇలా పలుచోట్ల వెతికారు. అయినా లాభం లేదు. అయితే ఎట్టకేలకు గాలి అజ్ఞాతం వీడారు.

తాను ఎక్కడకీ వెళ్లలేదని, బెంగళూరులోనే ఉన్నానంటూ న్యాయవాదితో కలిసి మాట్లాడుతున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు. తాను పరారీలో ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరిస్తున్నాయని గాలి ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు సహా అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో తనకు కేంద్ర క్రైమ్‌ బ్రాంచీ నుంచి నోటీసులు అందాయని, న్యాయవాదుల సలహా మేరకు సీసీబీ ఎదుట హాజరవుతున్నట్లు తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందుకే బెంగళూరు విడిచి వెళ్లలేదని తెలిపారు. బెంగళూరులో ఉంటూ మీడియా ద్వారా కేసుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడితోనే పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి ఈరోజు గాలి తన లాయర్‌తో కలిసి క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరయ్యారు.