జగన్ పై దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
posted on May 29, 2011 1:21PM
హైదరాబాద్:
మరో రెండు నెలల్లోగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్గూడ జైలుకో, తీహార్ జైలుకో వెళ్లడం ఖాయమని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రజల చేతిలో ఘోరంగా దెబ్బతిన్న డిఎంకె పార్టీలా రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అవుతుందని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రజల్లో జగన్ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. జగన్ కనిమొళి, రాజాల తరహాలో త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కడప ఉప ఎన్నికల్లో రూ.500 కోట్లు అడ్డం పెట్టుకొని తల్లీ, కొడుకులు గెలిచారని ఆన్నారు. ఓదార్పు యాత్ర పేరుతో కోట్లు గుమ్మరించి ప్రజలను మాయ చేసి తన వశం చేసుకోవాలని జగన్ చూస్తున్నాడని కానీ ఎన్ని మాయ మాటలు చెప్పినా జగన్ మాటలు ప్రజలు నమ్మరన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు కేవలం తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. జగన్కు లేదన్నారు. అవిశ్వాసం పెట్టమని నిత్యం టిడిపిని ప్రశ్నించే జగన్ చంద్రబాబు సవాల్ విసిరే వరకు తమ వద్ద ఎమ్మెల్యేలు లేరంటూ కొత్తరాగం అందుకొని వెనక్కి తగ్గారన్నారు. తనతో ఉన్న ఎమ్మెల్యేలపై జగన్కే పూర్తి నమ్మకం లేదని అన్నారు.