అవినాశ్రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా? జగనన్నకు చిక్కులేనా?
posted on Jan 18, 2022 11:35AM
వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్. స్వయనా జగన్ బాబాయ్నే దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. సీబీఐ విచారణ నెమ్మదిగా సాగుతోంది. అనుమానపు చూపులన్నీ ఎంపీ అవినాశ్రెడ్డి వైపే చూస్తున్నాయి. కానీ, తమ్ముడికి అన్న ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. కానీ, అవి ఆశీస్సులు కావని.. భయాందోళనలని తెలుస్తోంది. అవినాశ్పై ప్రేమతో జగన్ వెనకేసుకు రావడం లేదని.. తాను సపోర్ట్ చేయకపోతే అవినాశ్రెడ్డి ఎక్కడ బీజేపీలో చేరిపోతారనే భయంతోనే ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. అవినాశ్ లేకపోతే కడప జిల్లాలో వైసీపీ పరిస్థితి ఆగమాగం అవుతుందనే ఆందోళనతోనే జగన్రెడ్డి ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ మేరకు సంచలన విషయాలు వెళ్లడించారు కడప జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ బిటెక్ రవి.
"వివేకా కుటుంబ సభ్యులు సీఎం జగన్రెడ్డి దగ్గరకు వెళ్లి వివేకా హత్యకేసుపై ఒత్తిడి తెస్తే.. నేను అవినాష్ రెడ్డికి సపోర్టు చెయ్యకపోతే అవినాష్ బీజేపీలోకి వెళతాడని స్వయంగా జగన్ రెడ్డే అన్నారు" ఈ విషయం వివేకా కుటుంబ సభ్యులను అడిగితే చెబుతారని చెప్పారు బీటెక్ రవి.
వివేకా కేసులో ఎంపి అవినాష్రెడ్డి జైలుకు వెళితే.. స్థానికంగా నాయకత్వ సమస్య వస్తుందని జగన్ ఆందోళన చెందుతున్నారని.. అందుకే మమ్మల్ని వైసీపీలోకి రమ్మని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే అడుగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి మరో బాంబు పేల్చారు.
దేవిరెడ్డి శంకర్రెడ్డి గురించి మాట్లాడే వైసీపీ నాయకులకు, జిల్లా ప్రజలకు శంకర్ రెడ్డి చరిత్ర గురించి తెలుసునన్నారు. వైఎస్ వివేకా హత్యకేసుతో ఎంపి అవినాష్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు సంబంధం లేదని.. ఏ దేవుళ్లపైనైనా ప్రమాణం చేయగలరా? అని బిటెక్ రవి సవాల్ చేశారు.