నెయ్యిలో నల్లమిరియాలు కలిపి తింటే ఇన్ని లాభాలా?
posted on Mar 25, 2025 9:30AM
.webp)
నెయ్యిని భారతీయ ఋషులు అమృతంతో సమానమైన ఔషదంగా పేర్కొన్నారు. ఆహారంలో నెయ్యిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తినడం, ఉదయాన్నే నెయ్యిని వేడి నీటితో తాగడం లాంటి చిట్కాలు వినే ఉంటారు. కానీ నెయ్యిలో నల్ల మిరియాలు కలిపి తింటే ఆరోగ్యానికి బోలెడు లాభాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
దేశీ ఆవు నెయ్యి చాలా ఆరోగ్యకరమైనది అని ఆయుర్వేదం చెబుతుంది. ఎందుకంటే దేశీ ఆవు నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడతాయి. ఇక మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ పైపెరిన్ అనే సమ్మేళనం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యతో బాధపడేవారు ఒక మిరియాలు వాడితే చాలా మంచి ఉపశమనం ఉంటుంది. అయితే ఒక స్పూన్ దేశీ ఆవు నెయ్యిలో ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుని తీసుకున్నా లేదా ఒక స్పూన్ నెయ్యితో ఒక మిరియం గింజ తీసుకుని నమిలి తిన్నా చాలా మంచి ఉపశమనం ఉంటుంది.
దేశవాళీ ఆవునెయ్యి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు దేశ వాళీ ఆవు నెయ్యిలో కాస్త మిరియం పొడి కలిపి తీసుకుంటే మంచిది. పేగుల దారిని ఇది సుగమం చేస్తుంది. ఆహారం ప్రేగులలో సులువుగా కదిలేందుకు సహాయపడుతుంది. తద్వారా పేగులలో వ్యర్థపదార్థాలు మలం రూపంలో సులువుగా విసర్ఝించబడతాయి.
నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఈ లక్షణాలు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి. నెయ్యిలో కాసింత మిరియాల పొడి తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...