చెత్తతో ఉచిత వైఫై..
posted on Jan 5, 2017 3:01PM

ఇప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేని వారు చాలా తక్కువ మందే ఉన్నారు. స్మార్ట్ ఫోన్లు ఉన్న వారికి వైఫై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య రాజకీయ నేతలు కూడా ప్రజలను ఆకర్షించేందుకు ఉచిత వైఫై సర్వీసులు కూడా అందిస్తున్నారు. అయితే చెత్త ద్వారా ఫ్రీ వైఫై ఇస్తున్నారు..ముంబైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ అధికారులు. వినడానికి అశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు సంగతేంటంటే.. ముంబైకి చెందిన ఓ స్టార్టప్ వినూత్న ప్రయోగంతో ముందుకు వచ్చింది. అదేమిటంటే... ఆ నగరానికి చెందిన థింక్ స్క్రీమ్ (THINK SCREAM) అనే ఓ స్టార్టప్ కంపెనీ కొత్తగా వైఫై ట్రాష్ బిన్లను తయారు చేసింది. వీటిలో చెత్త వేస్తే చాలు. యూజర్లు 15 నిమిషాల పాటు వైఫైని ఉచితంగా వాడుకోవచ్చు. ఈ వైఫై ట్రాష్ బిన్ సాధారణ చెత్త కుండీలను పోలి ఉంటుంది. ఎత్తు నాలుగున్నర అడుగులు ఉంటుంది. దీని కింది భాగంలో ఓ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుంది. అది యూజర్లు వేసిన చెత్తను గుర్తించి పై భాగంలో అమర్చిన ఎల్ఈడీ స్క్రీన్కు మెసేజ్ పంపుతుంది. దీంతో ఆ మెసేజ్ను రిసీవ్ చేసుకున్న ఎల్ఈడీ స్క్రీన్పై ఓ పాస్వర్డ్ దర్శనమిస్తుంది. దాన్ని ఉపయోగించి ట్రాష్ క్యాన్లో అమర్చిన వైఫై రూటర్కు యూజర్లు కనెక్ట్ అవచ్చు. ఈ క్రమంలో అలా చెత్త వేశాక ఓసారి వైఫైకు కనెక్ట్ అయితే దాన్ని 15 నిమిషాల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. మొత్తానికి చెత్తతో వైఫై ఇవ్వడం నిజంగా వినూత్న ప్రయత్నమే.