వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానం చేయాలి.. కలాం..

 

సాగునీటి వనరుల వినియోగంలో అనంతపురం జిల్లా ఆదర్శమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. సోమవారం అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం, గరుడాపురంలో వ్యవసాయ మిషన్‌ ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు చిన్ననీటి కాలువ తవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించానని తెలిపారు. వ్యవసాయానికి టెక్నాలజీ అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. రైతు సమస్యలు తీర్చగలిగితే అభివృద్ధి సాధ్యమని కలాం అభిప్రాయపడ్డారు. పంట పండించడం మాత్రమే కాదు మార్కెటింగ్‌ చేయడం కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. రైతులకు సబ్సిడీ అవసరం లేదని, సాగునీరు, విద్యుత్‌, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తే చాలునని ఆయన అన్నారు. రెండో హరిత విప్లవం రావాల్సిన సమయమిదని ఆయన అభిప్రాయపడ్డారు. కలాం తెలుగులో కూడా ప్రసంగించారు.