టార్గెట్ పవన్.. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెలమాధురి కొత్త డ్రామా!
posted on Oct 11, 2024 11:28AM
తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఏజ్తో పనిలేదు మేం ప్రేమపక్షులం అంటూ బహిరంగంగా వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఇటీవల తిరుపతిలో పెద్ద రచ్చే చేశారు. ఫొటో షూట్ తో తిరుమల కొండపై వారు చేసిన రచ్చ అంతాఇంతాకాదు. దీంతో మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తుల నుంచి విమర్శలు ఎదురైనా డోంట్ కేర్.. మా ప్రేమ ఇలానే ఉంటుందంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. వీరిద్దరూ వైసీపీలోనే ఉన్నారు. వీరి ఓవర్ యాక్షన్కు వైసీపీ అధిష్టానం అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఇసుమంతైనా చేయడం లేదు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు ఎవరైనా కాస్త సంస్కారవంతంగా ఉండాలి. ఫ్యామిలీ పరంగా ఎన్ని అంతర్గత విబేధాలుఉన్నా సభ్యసమాజంలో వారి ప్రవర్తన నలుగురు మెచ్చుకునేదిలా ఉండాలి. కానీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలకు అవేమీ పట్టడం లేదు. వైసీపీ అధిష్టానం కూడా మందలించడం లేదు. దీనికితోడు వీరు మీడియాలో ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అంటూ హల్చల్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ చానెల్ ఇంటర్వ్యూలో వారిద్దరూ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసేయాలంటూ డిమాండ్ చేశారు.
దువ్వాడ శ్రీనివాస్, మాధురి వ్యవహారం తెలుగు డైలీ సీరియల్ తరహాలో ఫుల్ స్టాప్ అనేదే లేకుండా కొనసాగుతోంది. వారిద్దరికి సంబంధించి రోజూ ఏదోఒక ఎపిసోడ్ తెరపైకి వస్తూనే ఉంది. గత ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల తరువాత వారి కుటుంబ విబేధాలు రోడ్డెక్కాయి. ఇళ్లపై దాడులు, కోర్టు కేసులు, విడాకుల వరకు దువ్వాడ శ్రీనివాస్, వాణిల వ్యవహారం వెళ్లింది. దీనికి కారణం మాధురి అని వాణి, ఆమె కుమార్తెలు ఆరోపిస్తున్నారు. టెక్కలిలోని ఓ ఇంటిలో శ్రీనివాస్, మాధురి ఉంటుండటంతో వాణి, ఆమె కూతుళ్లు నిలదీశారు. ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వారు అక్కడే బైఠాయించి నిరసన దీక్ష చేశారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఈ తరువాత దువ్వాడ శ్రీనివాస్, మాధురి బహిరంగానే వారి మధ్య సంబంధాన్ని కుండబద్దలు కొట్టేశారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పి అందరికీ షాకిచ్చారు. వాణి నుంచి విడాకులు కోరుతూ శ్రీనివాస్ కోర్టుకు వెళ్లారు. విడాకుల ప్రక్రియ పూర్తవ్వగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటామంటూ ఏదో గొప్పపని అన్నట్లుగా వారు చెబుతున్నారు.
ఓ ప్రముఖ మీడియా ఛానెల్లో ఇటీవల శ్రీనివాస్, మాధురి మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితాన్ని, పర్సనల్ లైఫ్ను వేరువేరుగా చూడాలంటూ ఆ చానల్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ అధినేత జగన్ ని విమర్శిస్తున్నారని, మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అది తప్పుకాదా అంటూ ప్రశ్నించారు. ఆయనది తప్పుకానప్పుడు మేము చేసేది కూడా తప్పుకాదంటూ సమర్ధించుకున్నారు. మాది తప్పని అనేవాళ్లు పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని చెబుతూ.పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం.. లేటు వయసులో తమ ఘాటు ప్రేమాయణం ఒక్కటే అని చెప్పుకు ప్రయత్నం చేశారు. వీరి వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం వాస్తవమే. కానీ, పవన్ తో విడిపోయిన వారు ఎప్పుడైనా పవన్ పై విమర్శలు చేశారా...? లేదు. ఎవరి జీతాల్లో వారు నిమగ్నమయ్యారు. కానీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి వ్యవహారం అలాకాదు. శ్రీనివాస్ భార్య, ఆయన ఇద్దరు పిల్లలు అభ్యంతరం చెబుతున్నారు.
మాధురి ఎంట్రీతోనే శ్రీనివాస్ తప్పుదారి పట్టాడని, అతన్ని మాయచేసి మాధురి వలలో వేసుకుందని ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు శ్రీనివాస్, మాధురి లవ్ ట్రాక్తో పవన్ కల్యాణ్ వ్యవహారాన్ని పోల్చడమేమిటని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పినా జగన్ సస్పెండ్ చేయలేదని, అది కుటుంబ వ్యవహారమని చెప్పారని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తమ నాయకుడు గొప్ప వ్యక్తి అంటూ భజనకూడా చేశారు. వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే.. శ్రీనివాస్ లాంటి వారు వైసీపీలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్లందరినీ సస్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే చేస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే జగన్ భయపడి ఉంటారని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు తమ ప్రేమ వ్యవహారాన్నిపవన్ కల్యాణ్ పెళ్లిళ్లతో పోల్చడం చూస్తుంటే వారి పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్ధమవుతోందని నెటిజనులు అంటున్నారు.