రాజ్యాంగ రూపకర్త.. మన అంబేద్కర్..!

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.. లేదా అంబేద్కర్.. భారత రాజ్యాంగ రూపకర్తగా అందరికీ ఈయన సురపరిచితం. అంతేనా..  అట్టడుగు వర్గంలో జన్మించి  పేద ప్రజలకు,  అంటరానివారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్..  చాలామంది అంబేద్కర్ కేవలం  అట్టడుగు వర్గాల వారి కోసం మాత్రమే పారాడాడని చెబుతారు. కానీ అది తప్పు.. ఆయన భారతీయుల కోసం ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసం అణిచివేయబడుతున్న అన్ని రకాల వర్గాల కోసం కృషి చేశారు. అణగారిన వర్గాల న్యాయం,  సమానత్వం, గౌరవం కోసం పోరాటం చేశారు. సామాజిక వివక్షను నిర్మూలించి, తద్వారా చట్టం దృష్టిలో భారతదేశ పౌరులందరికీ సమానత్వాన్ని సమర్థిస్తూ డాక్టర్ అంబేద్కర్ తన జీవితాన్ని గడిపినందున ఆయన జన్మదినోత్సవాన్ని సమానత్వ దినోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే..

 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో మహర్ కులానికి చెందిన వ్యక్తిగా జన్మించారు మరియు జీవితాంతం తీవ్రమైన కుల వివక్షను అనుభవించారు. అంబేద్కర్ విద్యను సాధికారత,  సామాజిక పురోగతికి ఒక మార్గంగా భావించారు,  అణగారిన వర్గాలలో విద్యను వ్యాప్తి చేయడానికి 1923లో 'బహిష్కృత హితకారిణి సభ'ను స్థాపించారు.

అంబేద్కర్ చేసిన కృషి..

షెడ్యూల్ కులాలు,  షెడ్యూల్ తెగలకు నాటి కాలంలో చదువుకోవడం కష్టంగా ఉండేది.  తినడానికి తిండి దొరకడం కూడా కష్టంగా ఉండేది.  సమాజంలో వారికంటూ ఎలాంటి గౌరవం ఉండేది కాదు.  అలాంటి వారి కోసం అంబేద్కర్ కృషి చేసారు. వీరిని (SC, St) అనే వర్గంలో చేర్చారు.

కేవలం SC, ST లు మాత్రమే కాకుండా వెనుకబడిన ఇతర తరగతుల వారిని కూడా అంబేద్కర్ పరిగణలోకి తీసుకున్నారు. ఈ OBC వర్గం వారికి కూడా రిజర్వేషన్లు కల్పించారు.

మహిళలు పురుషులతో సమానంగా ఎదగడానికి,  మహిళల సాధికారత కోసం అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు.  

కార్మికులకు, కార్మికుల కుటుంబాల విషయంలో కూడా అంబేద్కర్ ఆలోచనలు సాగాయి. కార్మిక హక్కుల కోసం,  వారి అవసరాల గురించి చర్యలు సాగాయి.

పేదవారు,  సామాజికంగా వెనుకబడినవారు మొదలైన వారికి కులంతో సంబంధం లేకుండా విద్య,  ఉద్యోగం, రాజకీయాలు, సమాజంలో కూడా ఎవరు ఎటువంటి వివక్షకు గురికాకుండా అందరికీ సమాన హక్కులు ఉన్న దేశమే ఆయన కల.  ఆయన జీవితం కూడా ఈ హక్కుల సాదన దిశగానే సాగింది.  ఆయన జీవితం మొత్తం న్యాయం కోసం,  హక్కుల కోసం పోరాడటంలో గడిచిపోయింది.

దేశ నిర్మాణం గురించి అంబేద్కర్ కు ఒక కల ఉండేది అదే కుల నిర్మూలన.. దేశాన్ని కుల విభజన ద్వారా కాకుండా సమానత్వం ద్వారా నిర్మించాలని అంబేద్కర్ కలలు కన్నాడు. దేశ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ దేశం ఎప్పటికీ గుర్తుంచుకోదగిన వ్యక్తి,  పూజ్యునీయుడు.


                                      *రూపశ్రీ.