ఢిల్లీ కాలుష్య నివారణ.. ఈ గన్ తో మాయం...
posted on Dec 20, 2017 10:38AM
.jpg)
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఒక్క రోజు ఉంటే.. దాదాపు 40 సిగరెట్లు తాగిన దానితో సమానమని ఇటీవలే వాతావరణ నిపుణులు చెప్పారు కూడా. అంతేనా.. ఇటీవలే భారత్-శ్రీలంక మ్యాచ్ జరగగా.. పొగను పీల్చలేక కొందరు క్రికెటర్లు ఏకంగా మైదానంలోనే వాంతులు చేసుకున్న పరిస్థితులు కూడా చూశాం. దానిని బట్టి అక్కడ ఎంత పొల్యూషన్ ఉందో ఊహించుకోవచ్చు. ఇక ప్రభుత్వం కూడా దీనిపై పలు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే... ఢిల్లీలో పొగమంచు, కాలుష్యాన్ని నివారించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ కొత్త పరికరాన్ని ప్రవేశపెట్టారు. అదే.. ‘యాంటీ స్మాగ్ గన్’. దిల్లీ సెక్రటేరియట్లో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, పర్యావరణ శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ల ఆధ్వర్యంలో పరీక్షించి చూశారు.
క్లౌడ్ టెక్ సంస్థకు చెందిన ఈ పరికరం ఎరుపు రంగులో డ్రమ్ము ఆకారంలో ఉంటుంది. దీనిని వాటర్ ట్యాంక్కు అనుసంధానం చేయాలి. అప్పుడు దీని నుంచి నీరు జల్లుల్లా పడుతూ పొగమంచులోని దుమ్మూధూళిని నశింపజేస్తుంది. ఈ పరికరాన్ని వాటర్ ట్యాంక్కు అనుసంధానం చేస్తారు కాబట్టి ఎక్కడ పొగమంచు ఎక్కువగా ఉంటే అక్కడికి తీసుకెళ్లి వినియోగించుకోవచ్చు.ఈ యాంటీ స్మాగ్ గన్నును ఆనంద్ విహార్ ప్రాంతంతో పాటు అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ప్రయోగించనున్నారు.