బాణసంచా ప్రమాదం.. ఐదుగురి మృతి
posted on Mar 29, 2015 7:40PM

విశాఖ జిల్లా ఎస్. రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. గాయపడిన వారి సంఖ్య స్పష్టంగా తెలియడం లేదని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది వరకు బాణసంచా తయారీ కేంద్రంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలం విశాఖ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో వుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని గోకులపాడు గ్రామానికి చెందిన లక్ష్మి, సత్యవతి, లింగపల్లి శేషమ్మ, రమణ, పాయకరావు పేటకు చెందిన సత్తిబాబుగా గుర్తించారు.