కర్ణాటక కానిస్టేబుళ్ల సామూహిక సెలవు.. ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించిన సీఎం
posted on Jun 1, 2016 1:02PM

తక్కువ జీతాలు ఇస్తూ.. పనిభారం పెరిగిపోయిన కర్ణాటక కానిస్టేబుళ్లు ఓ నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలకు స్కాలర్షిప్లు, విద్యాసౌకర్యాలు కల్పించకపోవడం వంటి పలు సమస్యలకు నిరసనగా సుమారు 60 వేల మంది కానిస్టేబుళ్లు ఈ నెల 4వ తేదీన సామూహికంగా సెలవు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు దీనిపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందిస్తూ.. కానిస్టేబుళ్లు కనుక ఈ కార్యక్రమం చేపడితే వారిపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. అంతేకాదు నిరసనలో పాల్గొన్న కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగాలనుంచి తొలగిస్తామని డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాశ్ ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. కానిస్టేబుళ్లకు ఎవరికీ ఆ రోజు అనారోగ్యంతో ఉన్నారని మెడికల్ సర్టిఫికెట్లు ఇవ్వరాదంటూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వాసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.