కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్? రాజకీయ పునరేకీకరణ దిశగా రేవంత్ స్కెచ్.. 

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ టార్గెట్ గా రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ దిశగా ముమ్మర యత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా వివిధ వేదికల ద్వారా ఉద్యమిస్తున్న నేతలందరిని ఏకం చేసేలా ఆయన చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది.

చెరుకు సుధాకర్ తో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటి చైర్మెన్ మధు యాష్కి గౌడ్ చర్చలు జరిపారని సమాచారం. ఆ చర్చలు ఫలించడంతో త్వరలోనే చెరుకు సుధాకర్ అధికారికంగా హస్తం గూటికి చేరనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారట. కాంగ్రెస్ లో సముచిత స్థానం ఇస్తామని చెరుకుకు పీసీసీ పెద్దలు హామీ ఇచ్చారని చెబుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన చెరుకు సుధాకర్ కు బలమైన అనుచర గణం ఉంది. 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చెరుకు సుధాకర్ కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ లో కీలక నేతగా పని చేసిన చెరుకు సుధాకర్.. చాలా సార్లు జైలుకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ కూడా నమోదైంది.  వరంగల్ సెంట్రల్ జైలులో ఆయన చాలా రోజుల పాటు గడిపారు. తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో పొత్తులో భాగంగా నకిరేకల్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినా చివరి నిమిషంలో విఫలమైంది. నకిరేకల్ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి ఇచ్చారని మొదట ప్రచారం జరిగినా.. తర్వాత సీన్ మారిపోయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే తనకు సీటు రాకుండా పోయిందని చెరుకు సుధాకర్ అప్పట్లో ఆరోపించారు.

ఇటీవల జరిగిన శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరుకు సుధాకర్ పోటీ చేశారు. గట్టిగానే పోరాడినా అనుకున్నతంగా ఓట్లు సాధించలేకపోయారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో మొదటి నుంచి చెరుకుకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో చెరుకును కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో ఆయన సానుకూల స్పందించారని తెలుస్తోంది. మధుయాష్కి గూడా చెరుకు రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో జరిగే రెండో దళిత గిరిజన దండోరా సభలోనే చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. చెరుకు సుధాకర్  తో పాటు ఆయన వర్గీయులు కూడా కాంగ్రెసు పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.