కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో పాఠశాలలు మళ్ళీ తెరుచుకోనున్నాయి

కరోనా వైరస్ కారణంగా గత మార్చ్ నెలలో మూతపడిన పాఠశాలలను తిరిగి తెరిచేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. తాజాగా సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియను ప్రకటిస్తున్న కేంద్రం అన్‌లాక్ 3.0 ప్రక్రియలో భాగంగా ఈ నెలాఖరు నాటికి విస్తృతస్థాయి స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధివిధానాలను ఇందులో పేర్కొననుంది.

 

ఐతే విద్యార్థులు ఎప్పుడు, ఏ పద్దతిలో తరగతులకు హాజరుకావొచ్చన్న దాని పై రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం బోధన సిబ్బంది, అలాగే విద్యార్థుల్లో 33 శాతం సామర్థ్యంతో విడతల వారీగా తరగతులను నడపాలని, అంతే కాకుండా క్లాస్ రూముల్లో విద్యార్థులు 2, 3 గంటలకు మించి ఉండకుండా చూడాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొనే అవకాశమా ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

మొదటి షిప్టును ఉదయం 8 గంటల నుంచి 11 వరకు, రెండో షిప్టును మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించాల్సి ఉంటుందని తెలుస్తోంది. మధ్యలో ఉండే గంట విరామ సమయంలో తరగతి గదులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే భౌతికంగా క్లాసులు ఉండే అవకాశం ఉంది. మిగిలిన వారికి మాత్రం ఆన్‌లైన్ తరగతులనే కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.