జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. ఏపీ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం బంద్?
posted on Sep 19, 2021 9:22PM
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ విధానాలతో తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి తాజాగా మరో షాక్ తగిలింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో నడిచే ప్రాజెక్టులకు గండం ఏర్పడింది. ఈ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం బంద్ కానుండటమే ఇందుకు కారణం కానుంది.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో నిర్మించిన ప్రాజెక్టుల కింద విడుదల చేసిన రూ.960 కోట్లకు లెక్కలు చెప్పాలని డిపార్ట్మెంట్ ఎకానమిక్ అఫైర్స్ నుంచి ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి వచ్చాయి. డిపార్ట్మెంట్ ఎకానమిక్ అఫైర్స్ రాసిన లేఖపై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా స్పందించింది. గత వారం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఘాటు లేఖ వచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నిధులను వేరే పథకాలకు మళ్లించడంపై కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ.960కోట్లకు లెక్కలు చెప్పకపోతే భవిష్యత్తులో నిధులు విడుదల చేయబోమని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు స్పష్టం చేశాయి.
ఈ ప్రాజెక్టుల కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను ఇవ్వడం లేదని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ల ఫిర్యాదుతో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంస్థలు లేఖ రాశాయి. ఈ పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ఆర్థిక శాఖ తమకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాసింది. కేంద్రానికి ఏపీ సర్కార్ ఇచ్చే నివేదికను బట్టి ప్రాజెక్టుల మనుగడ ఆధారపడి ఉంది.