డీజీపీ ఆఫీసుకు వెళ్లిన టీడీపీ నేతలపై కేసు.. జైలుకు వెళ్లడానికి సిద్ధమేనన్న అయ్యన్న
posted on Sep 19, 2021 12:55PM
ఆంధ్రప్రదేశ్ లో అంతా రివర్సే. పాలనలో అంతా రివర్స్ సాగుతుందన్న ఆరోపణలు ఉండగా.. పోలీసుల తీరు కూడా అలానే ఉంటుంది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ప్రతి పక్ష నేతలపైనే తిరిగి కేసులు పెడుతున్నారు పోలీసులు. తాజాగా టీడీపీ నేతలపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణకు సంబంధించి డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు వెళ్లారు. అయితే భారీగా తరలివచ్చిన నేతలు డీజీపీ ఆఫీసు గేటును నెట్టివేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ తాడేపల్లి ఏఎస్ఐ మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్ రెడ్డి, ఆలపాటి రాజేంద్ర, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, బోడె ప్రసాద్, తెనాలి శ్రావణ్, జీవీ ఆంజనేయులు, నజీర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారంతా డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు. తాజాగా కొత్త కేసుతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరిగిపోతుందనే అక్కసుతోనే వైసీపీ దాడులు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు. జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమేనన్నారు. తానేమి బూతులు మాట్లాడలేదని చెప్పారు.తాను గుంటూరు జిల్లాకు వెళితే ప్రజలు బ్రహ్మాండమైన స్వాగతం పలికారని, ఇలా ఉంటుందని ఊహించలేదన్నారు. రెండున్నరేళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. దీంతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి తాను భయపడనని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారని, అది బలవంతంగా ఇచ్చారనేది ఆ స్టేట్ మెంట్ చూస్తే అర్థమవుతుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. రెండు నెలల్లో ఆయన మంత్రి పదవి పోయేలా ఉందని, మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారని ఆరోపించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని సూచించారు. పార్టీ కోసం, ప్రభుత్వం చేస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలపై తాము మాట్లాడతామని, అధికారపార్టీ ఏం చేసినా భయపడేది లేదని అయ్యన్న స్పష్టం చేశారు.