ఏపిలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్

 విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ
22న నోటిఫికేషన్, మే 9న పోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విజయసాయి రెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంలో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (ఏప్రిల్ 15) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల, 29 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు  తుది గడువు మే 2. పోలింగ్ మే  9న జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.  

కాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి జరగనున్న ఉప ఎన్నికలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం లాంఛనమే. అయితే కూటమి పార్టీలలో ఏ పార్టీ ఈ ఎన్నికలో పోటీకి నిలబడు తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ  అయిన రాజ్యసభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.  వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఆ పార్టీ తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి లేకపోవడంతో  రాజ్యసభ ఉప ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థి ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది.