ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో    ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావరి, కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నియోజ‌కవ‌ర్గాల‌కు, శ్రీకాకుళం-విజ‌య‌న‌గ‌రం-విశాఖ‌ప‌ట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు జరగనున్నాయి.

ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆ ఎన్నికల నోటిషికేషన్ ఫిబ్ర‌వ‌రి 3న విడుదలౌతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ కూటమి పార్టీల నేతలకు దిశానిర్దేశం చేశారు.  ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రాజ‌శేఖ‌ర్‌ను భారీ మెజారి టీతో గెలిపించాల‌ని కోరారు. ఎన్‌డీఏ ప‌క్షాల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాలు పెట్టుకుని ప‌నిచేయాల‌ని సూచించారు. సుస్థిర పాలన కోసం ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను విజయపథంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనీ, రాష్ట్రం బాగు కోసం, ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.