జగన్ హయాంలో విధ్వంసం.. ఆర్థిక శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం!
posted on Jul 26, 2024 10:37AM
వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసంపై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆ వరుసలో శుక్రవారం (జులై 26) ఏడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్నారు. అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం ఈ శ్వేల పత్రాన్ని విడుదల చేస్తారు. ఇంత వరకూ అమరావతి, పోలవరం, శాంతి భద్రతలు, మద్యం కుంభకోణం, సహజవనరులు, గనులు, విద్యుత్ రంగంపై ఇప్పటికే ఆరు శ్వేత పత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అత్యంత కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.
వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు సందర్బాలలో గణాంకాలతో సహా వివరించిన సంగతి తెలిసిందే. జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్థిక శాఖలో చోటుచేసుకున్న అవకతవకలు, అప్పులు, ఇతర అక్రమాలపై లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణచయించిన చంద్రబాబు ప్రభుత్వం 2019-24 మధ్య లక్షా 41 వేల 588 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్లు తేల్చింది. 93 వేల కోట్లు సీఎఫ్ఎమ్ఎస్లోకి అప్లోడ్ చేయలేదనీ, అలాగే 48 కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదనీ గుర్తించింది.
నీటిపారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19 వేల 324 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు, ఆర్థిక శాఖ నుంచి 19 వేల 549 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు ఇప్పటికే చంద్రబాబుకు నివేదించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14 వేల కోట్లకు పైగా బకాయిలు, మున్సిపల్ శాఖలో 7 వేల 700 కోట్ల బకాయిలు కలిపి మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు శాసనసభలో ఆర్థికశాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ శ్వేత పత్రం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జగన్ విధ్వంసాన్ని చంద్రబాబు కళ్లకు కట్టనున్నారు.